పాకిస్థాన్లో నా సినిమాను విడుదల చేయను
ముంబయి: తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టోటల్ ధమాల్’ సినిమాను పాకిస్థాన్లో విడుదల చేయనని అంటున్నారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్. ఇటీవల జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో పాక్కు చెందిన ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 40 మందికిపైగా జవాన్లు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తన సినిమాను పాకిస్థాన్లో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అజయ్ ట్విటర్లో వెల్లడించారు. అజయ్ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘దేశం కంటే ఎవ్వరూ గొప్ప కాదు అని నిరూపించారు సర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ‘టోటల్ ధమాల్’ చిత్రబృందం అంతా కలిసి అమరవీరుల కుటుంబాలకు రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, రితేశ్ దేశ్ముఖ్, అర్షద్ వార్సి, అనిల్ కపూర్, ఈషా గుప్తా, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.