పొగమంచు ముంచింది.. 13 కార్లు ఢీ!
దేశ రాజధాని సమీపంలో దట్టమైన పొగ మంచు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నది. గ్రేటర్ నోయిడాలోని దన్కౌర్ ప్రాంతంలో యమున ఎక్స్ప్రెస్ వేపై 13 కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. బుధవారం ఉదయం నుంచీ పొగమంచు అధికంగా ఉండటంతో అసలు ముందేమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు వీళ్లలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. ఎక్స్ప్రెస్ వేకు రెండు వైపులా వాహనాలు ఢీకొన్నాయని దన్కౌర్ ప్రాంత పోలీస్ అధికారి ఫర్మూద్ తెలిపారు. ఈ ఎక్స్ప్రెస్ వేపై ఒకచోట నిర్మాణం జరుగుతున్నదని, అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసినా పొగమంచు కారణంగా అవి సరిగా కనిపించడం లేదని, అందుకే ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన చెప్పారు. కొన్ని వాహనాలు ఆగ్రాకు, మరికొన్ని ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. అటు పంజాబ్లోనూ పొగమంచు కారణంగా ఇవాళ ఉదయం జరిగిన మరో ప్రమాదంలో 9 మంది మరణించిన విషయం తెలిసిందే. హర్యానాలోని సిర్సాలోని ఎన్హెచ్-9పై జరిగిన ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు ముంచుతున్నది. ఢిల్లీలో దీనికి కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.