ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్
జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కు పోటీగా నిన్న కాక మొన్ననే అదిరిపోయే ప్రీపెయిడ్ ఆఫర్ను ప్రకటించిన టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్, మరో బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది. ‘హాలిడే సర్ ప్రైజెస్” ఆఫర్ వాలిడిటీని మరో 30 రోజులు పాటు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. దీంతో వన్ మోర్ బిల్లింగ్ సైకిల్ కింద కూడా ఉచిత డేటాను పోస్టు పెయిడ్ కస్టమర్లు వాడుకోవచ్చు. ఇప్పటివరకు ఎయిర్ టెల్ సర్ ప్రైజ్ ఆఫర్ ను క్లయిమ్ చేసుకోని వారికి ఏప్రిల్ 30 వరకు సమయమిచ్చింది. మార్చి 31తో ఈ ఆఫర్ ను క్లయిమ్ చేసుకునే గడువు ముగిసింది. ప్రస్తుతం ఏప్రిల్ 30 వరకు దీన్ని పొడిగించింది. సమ్మర్ హాలిడేస్ ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఆఫర్ గడువును పొడిగించినట్టు తెలుస్తోంది.
ఈ డేటా సర్ ప్రైజ్ ఆఫర్, ఫిబ్రవరి 28 కంటే ముందస్తుగా ఎయిర్ టెల్ నెట్ వర్క్ లోకి మారిన పోస్టు పెయిడ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఎలాంటి ధరలు లేకుండా ఉచితంగా నెలకు 10జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు అంతకమునుపే కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ కింద కంపెనీ నెలకు 10జీబీ ఉచిత డేటా చొప్పున మూడు నెలల పాటు 30జీబీ డేటాను అందిస్తోంది. అంటే ఇప్పుడు ఆ ఆఫర్ ను క్లయిమ్ చేసుకున్నా.. మరో మూడు నెలల పాటు 30జీబీ ఉచిత డేటాను వాడుకోవచ్చు. అదేవిధంగా బెస్ట్ ఇంటర్నేషనల్ రోమింగ్ రేట్లకు కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం యూజర్లు దేశం విడిచి విదేశాలు వెళ్తున్న సమయంలో రోమింగ్ ప్యాక్ ను యాక్టివేట్ చేసుకోవడం మరిచిపోతే, వారికి ఆటోమేటిక్ గా అవసరమైన ప్యాక్ లను యాక్టివేట్ చేసేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతోంది. ఉదాహరణకు సింగపూర్ కోసం రూ.499తో డైలీ ప్యాక్ ను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తే, దాన్ని యూజర్లు యాక్టివేట్ చేసుకోకుండానే సింగపూర్ కు వెళ్లినప్పుడు కంపెనీ ఆటోమేటిక్ గా దీన్ని యాక్టివేట్ చేస్తోంది. అయితే యూజర్ల డైలీ వాడకం రూ.499కి మించితేనే ఆ ప్యాక్ ను కంపెనీ యాక్టివేట్ చేస్తోంది. ఒకవేళ యూజర్ల డైలీ వాడకం 499 రూపాయల కంటే తక్కువగా ఉంటే, సాధారణ రేట్ల ప్రకారమే ఛార్జీలు వేస్తోంది.