మీడియా ముందు కంటతడి పెట్టిన ఐశ్వర్య
సెలబ్రిటీలు ఎక్కడికెళ్లినా వందల కెమెరాలు వాళ్లను ఫాలో కావడం కామనే. అందులోనూ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ అంటే ఇక చెప్పేదేముంది? మొన్న ముంబైలో తన తండ్రి జయంతి వేడుకలను జరుపుకోవడం కోసం తల్లి బృందతో కలిసి శుశృష హాస్పిటల్కు వెళ్లింది ఐష్. స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రైవేట్ కార్యక్రమంలో అక్కడున్న చిన్నారుల మధ్య తండ్రి జయంతి వేడుకలు జరుపుకోవాలని ఆమె భావించింది. అయితే అక్కడ కూడా పదుల సంఖ్యలో కెమెరాలు తనను ఫాలో అవడం, వరుసగా ఫొటోలు క్లిక్మనిపించడంతో ఆమెకు ఒళ్లు మండింది. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఐశ్వర్య.. ఫొటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది. తన ప్రైవసీని గౌరవించాలని తడి నిండిన కళ్లతో ఐశ్వర్య వేడుకుంది. ప్లీజ్ ఆపుతారా. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇదేమీ ప్రిమియర్ షో కాదు. మరేదో పబ్లిక్ ఈవెంట్ కాదు. కాస్తయినా గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అంటూ ఐష్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ తర్వాత అక్కడున్న చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసింది.