కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు
కాన్పూర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సేల్దా – అజ్మీర్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. కాన్పూర్ డివిజన్లోని దెహాత్ జిల్లాలో ఈ రోజు వేకువజామున ఎక్స్ప్రెస్ రైలులోను 14 బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విషయం తెలియగానే సహాయక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంది. బోగీల నుంచి ప్రయాణీకులను బయటకు తీస్తున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాద ఘటన పైన కేంద్రమంత్రి సురేష్ ప్రభు స్పందించారు. తాను వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నానని చెప్పారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని, సహాయక చర్యలు చేపట్టాలని తాను అధికారులను ఆదేశించానని ఆయన చెప్పారు. గాయపడ్డ వారికి చికిత్స అందించాలని సూచించానన్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశిస్తామన్నారు.