శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి
నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. ఈ పర్వదినాన శివయ్యను ఎలాంటి ద్రవ్యంతో అభిషేకిస్తే మంచిదో వేదపండితులు ఇలా వర్ణిస్తున్నారు. శివుడు అభిషేక ప్రియుడనే విషయం తెల్సిందే. శివలింగంపై కాసిన్ని నీళ్లు పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.అలాంటి శివలింగాన్ని నీళ్ళతో అభిషేకం చేసి, పూలు… పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట, ‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి…. సకలైశ్వర్యములు సమకూరతాయని వేదపండితులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కటకటలాడుతున్నాయి. దేశ వ్యాప్తంగా హరనామ స్మరణ మార్మోగుతోంది. ముక్కంటి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం మల్లన్న, వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున క్యూకట్టారు. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.శ్రీశైలంలో నేటి సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనుండగా, రాత్రి పాగాలంకరణ, లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 12 గంటలకు శ్రీభ్రమరాంబదేవి-మల్లికార్జునస్వామి వార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.