మమ్మల్ని చూసి కుళ్లుకుంటున్నారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ.. ఇండియా టాప్ టెల్కోలపై నిప్పులు చెరిగారు. జియో నెట్ వర్క్ కు సహకరించకుండా వ్యూహాత్మకంగా నష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తాము సామాన్యులకు సేవలందిస్తామని అంబానీ స్పష్టం చేశారు.
దేశీయ టెలికాం మార్కెట్లో జియోతో రిలయన్స్ సంచలనం సృష్టించింది. డిసెంబర్ 31వరకు ఫ్రీ జియో ఆఫర్ ను ఇప్పుడు మార్చి 31వరకు పొడిగించారు. జియో వెల్కమ్ న్యూఇయర్ ఆఫరని దీనికి పేరు పెట్టారు. ఆ తర్వాత కూడా దేశీయ కాల్స్ ను పూర్తి ఉచితంగా అందిస్తామని ముకేష్ ప్రకటించారు.
మరోవైపు జియో దూకుడుపై టాప్ టెల్కోలు బెంబేలెత్తుతున్నాయి. ఇప్పటికే ట్రాయ్ కు కంప్లైంట్ ఇచ్చిన టెల్కోలు అంతటితో తగ్గకుండా తాము టవర్లివ్వమని మొదట భీష్మించాయి. ఆ తర్వాత సహకరిస్తామని టవర్స్ అప్ గ్రేడ్ చేశాయి. కానీ ఇప్పటికీ జియో వాయిస్ కాల్స్ చాలావరకు బ్లాక్ అవుతున్నాయన్న విమర్శలున్నాయి.
జియో సక్సెస్ అయిన తరుణంలో ఉద్యోగులు, కస్టమర్స్ తో ముకేష్ మీటింగ్ అరేంజ్ చేశారు. మొత్తం ఐదు కోట్ల మంది జియో వినియోగదారులున్నారన్న ముకేష్.. త్వరలోనే వీరి సంఖ్య మరింత పెంచుకుంటామంటున్నారు. ముకేష్ సీరియస్ కావడం చూస్తుంటే.. భవిష్యత్ లో జియో దూకుడు ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.