అంబానీల విమానంలో శ్రీదేవి మృతదేహం తరలింపు

దివంగత సినీతార శ్రీదేవీ పార్థివదేహం మరికొద్ది సేపట్లోనే దుబాయ్‌ నుంచి ముంబైకి తరలించనున్నారు. భారత కుబేరులు అంబానీ కుటుంబానికి చెందిన ప్రత్యేక జెట్‌ విమానంలో భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్‌లో శ్రీదేవీకి పోస్ట్‌మార్టం ప్రారంభమైన సమయంలోనే ముంబై నుంచి అంబానీ విమానం బయలుదేరి వెళ్లింది. 13 సీట్లున్న ఈ ప్రత్యేక విమానం(ఎంబ్రార్‌-135బీజే) రిలయన్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ట్రావెల్‌ లిమిటెడ్‌కు చెందినది. ఈ సంస్థ ప్రస్తుతం అనిల్‌ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తోంది.

బోనికపూర్‌ మేనల్లుడు మొహిత్‌ మార్వా పెళ్లి కోసం రస్‌ ఆల్‌ ఖైమాకు వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని రషీద్‌ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. అయితే, దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోంది. సోమవారం మధ్యాహ్నాంలోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది. శ్రీదేవి పార్థివదేహాన్ని మొదట ఆమె ఇంటికి తరలిస్తారు. అటు నుంచి మెహబూబా స్టూడియోకు తీసుకెళతారు. అనంతరం జుహూలోని శాంతా క్రజ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *