ఆమెతోపాటు విమానం ఎక్కిన గుర్రం…
సాధారణ వ్యక్తులు విమానం ఎక్కాలంటేనే ఎన్నో నిబంధనలు అడ్డు వస్తాయి. కానీ, ఆ మహిళ మాత్రం ఏకంగా గుర్రాన్నే వెంట తెచ్చుకుంది. గుర్రంతోపాటు విమానంలోకి ఎక్కి తన సీటులో కూర్చొంది. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అమెరికాలో చికాగో నుంచి నెబ్రస్కా నగరంలోని ఒమహాకు వెళ్లే అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఫ్లిర్టీ అనే ఈ పెంపుడు గుర్రం ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండానే ప్రయాణం సాగించింది. అది తన యజమానురాలి కాళ్ల వద్దే పడుకుంది. అయితే, ఆ విమానంలోని ప్రయాణికులు మాత్రం ఆ గుర్రం మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయారు. పొట్టిగా క్యూట్గా ఉన్న గుర్రాన్ని వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేశారు. మనిషులకు ఎమోషనల్గా దగ్గరైనా, లేదా సేవలు అందిస్తున్న జంతువులను ఇకపై విమానాల్లో తీసుకెళ్లవచ్చని అమెరికా రవాణా విభాగం వెల్లడించింది. అయితే, ఆయా జంతువుల వివరాలను ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంది. అప్పటి నుంచి అమెరికావాసులు తమ పెంపుడు జంతువులతో విమానంలో ప్రయాణిస్తున్నారు.