అమిత్ షా కీలక ప్రకటన
కశ్మీర్ అంశంపై చర్చించేందుకు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి భేటీ ముగిసింది. కశ్మీర్ వ్యవహారాలు, ప్రస్తుత పరిస్థితిపై కేబినెట్ చర్చించింది. అయితే దీనిపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించి, కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తొలుత రాజ్యసభలో అమిత్ షా మాట్లాడనున్నారు. అనంతరం 12 గంటలకు లోక్సభలో కశ్మీర్ అంశంపై ప్రకటన చేయనున్నారు. మరోవైపు మరికాసేపట్లో కాంగ్రెస్ లోక్ సభ ఎంపీలు భేటీ కానున్నారు. కశ్మీర్లో పరిణామలు వేగంగా మారుతున్న నేపథ్యంలో వివిధ పార్టీలు ఈ అంశంపై ఇప్పటికే లోక్సభలో చర్చించేందుకు నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోక్సభ ఎంపీల భేటీ ప్రధాన్యత సంతరించుకుంది.ఈ నేపథ్యంలో హోంమంత్రి ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు కశ్మీర్ కల్లోలంపై చర్చించేందుకు సమావేశమైన కేంద్రమంత్రి మండలి భేటీ ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ భేటీకి మంత్రివర్గ సభ్యులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అధికారులు పాల్గొన్నారు. అక్కడి పరిస్థితిపై ఆర్మీ, కేంద్రహోంశాఖ అధికారులు మంత్రివర్గానికి వివరించారు.
అమర్నాథ్ యాత్ర మార్గంలో పేలుడు పదార్థాలు, మారణాయుధాలు లభ్యమయ్యాయని, వీలైనంత త్వరగా యాత్రను ముగించుకుని యాత్రికులు వెళ్లిపోవాలని కేంద్రం నాలుగు రోజుల కిందట హెచ్చరికలు జారీచేసింది. తర్వాత తొలుత 10,000 అదనపు బలగాలను తరలించిన కేంద్రం, వీటిని ప్రస్తుతం 35,000 వేలకు పెంచింది. విద్యా సంస్థలను మూసివేసి, పర్యాటకులను వెనక్కు వెళ్లిపోవాలని సూచించడంతో వారు హడావుడిగా తిరుగు ముఖం పట్టారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొడానికి ఆసుపత్రులను పూర్తిస్థాయి సన్నద్ధం చేశారు.