బిగ్బికు దాదాసాహేబ్ ఫాల్కే…పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారన్న చిరంజీవి
బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్కు ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనకు హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. 1969లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్ గత యాభై ఏళ్లలో చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించారని కొనియాడారు. ఆయన ఇప్పుడు వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని అన్నారు. ‘సైరా’లో గోసాయి వెంకన్న పాత్రలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్రం విడుదల కాబోతున్న తరుణంలో ఆయనకు ఈ అవార్డు ప్రకటించడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అమితాబ్కు అవార్డు రావడంతో ‘సైరా’ యూనిట్ మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిందని చిరంజీవి అన్నారు. అమితాబ్ తన నటనతో కోట్లాదిమందికి వినోదం పంచడంతోపాటు వారికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని, ఆయనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని నాగార్జున ట్వీట్ చేశారు.