ఆమ్రపాలి సంస్థ కేసులో గృహ కొనుగోలుదారులకు ఊరట
రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఇంటి నిర్మాణాలను ఆలస్యం చేయడంతో ఆ సంస్థ రిజిస్ట్రేషన్ను రద్దు చేయడంతో పాటు, అలాంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు, వాటికి సహకరించిన బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. గందరగోళంలో చిక్కుకున్న వేలాది మంది గృహ కొనుగోలుదారులకు సోమవారం కోర్టులో ఊరట లభించింది. కొనుగోలుదారులకు మద్దతుగా నిలుస్తూ మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్బీసీసీ)కు మంగళవారం సూచించింది. కొనుగోలు దార్ల సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థ పక్కదారి పట్టించడంలో నోయిడా, గ్రేటర్ నోయిడాకు చెందిన అధికారులు సహకరించారని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది.ఈ సంస్థకి చెందిన వివిధ ప్రాజెక్టులలో సుమారు 42,000 ఫ్లాట్ల నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
సంస్థ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) నమోదుతోపాటు అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అలాగే కంపెనీ డైరెక్టర్లు అందరిపైనా మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను ఆదేశించింది. కోర్టు రిసీవర్గా ఆర్ వెంకట్రామన్ను నియమించిది. భారతదేశం అంతటా అన్ని ప్రాజెక్టుల ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని, అవి సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని, ప్రమోటర్లందరి ఉల్లంఘనలపై నివేదికను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సంబంధిత మంత్రిత్వ శాఖలను కోర్టు కోరింది. ఇద్దరు ఆడిటర్లలో ఒకరైన అనిల్ మిట్టల్పై విచారణ జరిపి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీం చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది.