లైవ్ అప్డేట్స్: వాజ్పేయి అంతిమ యాత్ర ,కాలినడకన మోదీ, షా
భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్పేయికి నివాళులు కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన తుది వీడ్కోలు పలికారు. వాజ్పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాజ్పేయి కన్నుమూసిన అనంతరం ఆయన పార్థివదేహాన్ని తొలుత ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్కు తరలించారు.
అనంతరం వాజ్పేయి పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్ యోగిలు వాజ్పేయికి నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివచ్చి వాజ్పేయికి నివాళులు అర్పించారు.
- ఢిల్లీకి చేరుకున్న అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్. వాజ్పేయి అంతియాత్ర స్థలానికి బయలుదేరిన ఖర్జాయ్
- రాష్ట్రీయ స్మృతి స్థల్లో రాజనీతిజ్ఞుడు, ప్రజల నేత వాజ్పేయి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
- అంతిమయాత్ర కొనసాగుతున్న దీన్ దయాల్ మార్గ్ రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది.
- ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కాలి నడకన వాజ్పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు