బిగ్ బాస్-3 ఎపిసోడ్-19 ఏం జరిగింది?
బిగ్ బాస్ తెలుగు సీజన్-3 ఎపిసోడ్-19 టాస్క్ గురించే ప్రధాన చర్చ జరిగింది. ఇంటి సభ్యుల చర్యను సీరియస్గా తీసుకున్న బిగ్ బాస్ వారికి క్లాస్ పీకారు. కన్ఫెషన్ రూంలోకి వెళ్లిన రవికృష్ణ ఈ విషయంలో తన తప్పు ఉందని బిగ్ బాస్కి క్షమాపణలు చెప్పారు. అయితే, అద్దం పగలగొట్టమని రవికృష్ణను ప్రోత్సహించిన శ్రీముఖి చర్యను బిగ్ బాస్ తప్పుబట్టారు. దీనికి శిక్షగా వచ్చే వారం ఎలిమినేషన్కు శ్రీముఖిని బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశారు. భర్త వరుణ్ సందేశ్ ఛాతిపై వాలిపోయిన వితికా షెరు కంటతడి పెట్టుకుంది. ఒకటే ఏడుపు. అసలు ఎందుకు ఏడుస్తున్నావంటూ ఆమెను రాహుల్ ఓదార్చాడు. టిష్యూలు తీసుకొచ్చి కళ్లు తుడిచాడు. టాస్క్లో జరిగిన గొడవ గురించి తలుచుకుని ఏడుస్తున్నావా అంటూ వరుణ్ సందేశ్ తన భార్యను అడిగాడు. అవునూ అంటూ చిన్నగా వితిక తల ఊపింది. రాహుల్ నవ్వించే ప్రయత్నం చేశాడు. అలీని, పునర్నవిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. వీరికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తిచేస్తే తరవాతి వారం నామినేషన్ నుంచి సేఫ్ అవుతారని వారికి బిగ్ బాస్ చెప్పారు. ఒకవేళ ఈ సీక్రెట్ టాస్క్ గురించి ఎవరితోనైనా చెబితే తరవాతి వారం ఎలిమినేషన్కు నేరుగా నామినేట్ అవుతారని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. రాత్రి అందరూ పడుకున్న తరవాత ఎవరి కంట పడకుండా ఒక సీక్రెట్ రూంలోకి వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. అలీని రాత్రి సీక్రెట్ రూంలోకి వెళ్లమని చెప్పిన బిగ్ బాస్.. పునర్నవిని తెల్లవారిన తరవాత వెళ్లాలని ఆదేశించారు. రాత్రి అందరూ పడుకున్నాక 1.30 గంటల సమయంలో ఎవరి కంట పడకుండా అలీ సీక్రెట్ రూంలోకి వెళ్లాడు. ఆ తరవాత ఉదయం 7.30కి ఎవరి కంట పడకుండా పునర్నవి సీక్రెట్ రూంలోకి వెళ్లింది. అలీ, పునర్నవి కనిపించకపోవడంతో రవికృష్ణ వాళ్లని వెతకడం మొదలుపెట్టాడు. అయితే, ఎవరూ పెద్దగా కంగారు పడలేదు. బిగ్ బాస్ వాళ్లను ఎక్కడో దాచి ఉంటారని అనుకున్నారు. అలీ, పునర్నవిలు సీక్రెట్ రూంలో నుంచి బయటికి వెళ్లాలంటే ఇంటి సభ్యులకు రెండు త్యాగాలను సూచించాలని బిగ్ బాస్ వాళ్లను అడిగారు. ఇంట్లో చెప్పులు వేసుకోకూడదని, భోజనంలో పెరుగు ఉండదని తెలిపారు. అయితే, చెప్పులు వేసుకోకూడదు అని బిగ్ బాస్ చెప్పినప్పుడు శ్రీముఖి అమ్మో కాళ్లు పాడైపోతాయి అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కానీ, ఆ త్యాగానికి ఒప్పుకుంది.