బిగ్ బాస్ -3 ఎపిసోడ్-20 లో ఏం జరిగింది?
గురువారం నాటి 19వ ఎపిసోడ్లో సీక్రెట్ టాస్క్లో భాగంగా అలీ, పునర్నవి హౌజ్లో ఉన్న సీక్రెట్ రూంలోకి వేర్వేరుగా వెళ్ళిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ చెప్పినవన్నీ శుక్రవారం నాటి 20వ ఎపిసోడ్లో ఇంటి సభ్యులు తీసుకెళ్లి స్టోర్ రూంలో పెట్టేశారు. మ్యాట్రిసెస్, గుడ్లు, పాలు, పెరుగు, చెప్పులు, షూస్ అన్నీ ప్యాక్ చేసేసి స్టోర్ రూంలో పెట్టారు. ఇంటి సభ్యులంతా లివింగ్ రూంలోకి రావాలని బిగ్ బాస్ ఆదేశించారు. అందరూ వచ్చి టీవీ ముందు కూర్చున్నారు. టీవీలో అలీ, పునర్నవి దర్శనమిచ్చారు. అయితే, తమను హౌజ్మేట్స్ టీవీలో చూస్తున్నట్టు అలీ, పునర్నవికి తెలీదు. ఈ సమయంలో సీక్రెట్ రూంలో ఉన్న అలీ, పునర్నవికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ రూంలో చెట్టుకు ఒక డార్ట్ బోర్డు ఉంది. ఆ బోర్డుపై అలీ, పునర్నవి తప్ప మిగిలిన కంటెస్టెంట్ల ఫొటోలు ఉన్నాయి. వీళ్లలో తమకు నచ్చని ఐదుగురుని ఎంపిక చేసి, దానికి గల కారణం కూడా చెప్పాలని అలీ, పునర్నవికి బిగ్ బాస్ సూచించారు. పునర్నవి తనకు హిమజ, శ్రీముఖి, వితిక, రాహుల్, బాబా భాస్కర్ నచ్చరని చెప్పింది. ఒక్కొక్కరికి ఒక్కో కారణం కూడా వెల్లడించింది. అయితే, హిమజకు చెప్పిన కారణం ఆసక్తికరంగా ఉంది. ఆమె ప్రతిదానికి ఒక ఏడుపు ఏడుస్తుందని, అది యాక్టింగ్లా ఉంటుందని ఆరోపించింది. ఇక అలీ తనకు మహేష్ విట్ట, తమన్నా, వితిక, మరో ఇద్దరి పేర్లు చెప్పాడు. పునర్నవి, అలీ కారణాలు చెబుతున్నప్పుడు వారిని టీవీలో చూస్తున్న మిగిలిన కంటెస్టెంట్లు రకరకాల హావభావాలను ప్రదర్శించారు. ముఖ్యంగా తమన్నా గురించి అలీ చెబుతున్నప్పుడు ఆమె హావభావాలు అదో రకంగా ఉన్నాయి. సీక్రెట్ రూంలో నుంచి అలీ, పునర్నవి బయటికి వచ్చేసీనా తరువాత ఆ సీక్రెట్ రూంని కూడా ఇంటితో కలిపేశారు బిగ్ బాస్. అలీ, పునర్నవి సీక్రెట్ టాస్క్ను విజయవంతంగా పూర్తిచేశారని, వాళ్లు వచ్చేవారం నామినేషన్లలో ఉండరని బిగ్ బాస్ చెప్పారు. అంతే కాకుండా సీక్రెట్ రూంను వాళ్ల తరఫున ఇంటి సభ్యులకు గిఫ్ట్గా ఇస్తున్నట్టు చెప్పారు.
బిగ్ బాస్ హౌజ్కి తొలి కెప్టెన్గా వ్యవహరించిన వరుణ్ సందేశ్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని బిగ్ బాస్ అన్నారు. స్మోకింగ్ రూంకి గుంపులు గుంపులుగా వెళ్తున్నారని, పగటి పూట చాలా మంది హౌజ్మేట్స్ పడుకుంటున్నారని, మైక్ను చాలా మంది పెట్టుకోవడం లేదని ఇలా చాలా తప్పిదాలనే బిగ్ బాస్ పాయింట్ ఔట్ చేశారు. దీనికి శిక్షగా వరుణ్ సందేశ్ను సర్వర్గా మార్చారు. ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్లినా, లోపలికి వచ్చినా వరుణ్ డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. అలాగే ఆహారం కూడా ఇంటి సభ్యులకు వరుణ్ సందేశ్ అందించాల్సి ఉంటుందని చెప్పారు.
ఇంటిలోని నియమ నిబంధనలను పాటించకుండా తప్పులు చేసిన సభ్యులందరికీ బిగ్ బాస్ శిక్ష వేశారు. అలీ, శ్రీముఖి, అశురెడ్డి, బాబా భాస్కర్, తమన్నా, రోహిణి, శివజ్యోతి, మహేష్ విట్టలకు బిగ్ బాస్ శిక్ష విధించారు. గార్డెన్ ఏరియాలో రంధ్రాలున్న రెండు వాటర్ డ్రమ్ములను పెట్టారు ఆ రంధ్రాల నుంచి వాటర్ కారిపోతోంది. ఆ వాటర్ కారిపోకుండా వీళ్లలో కొంత మంది వేళ్లు అడ్డుపెట్టాలి. ఈ సమయంలో ఇంటి నియమ నిబంధనలన్నింటినీ పాటించాలి. ఎలాంటి తప్పుచేసినా శిక్ష అనుభవిస్తోన్న మిగిలిన సభ్యులు పూల్లోకి దూకి మునక వేయాలి. ఇలా ఎన్నిసార్లు తప్పుచేసినా అన్ని సార్లు మునక వేయాలి.