అఫ్గానిస్తాన్ లో బాంబుతో దాడి
ఆఫ్గనిస్తాన్లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. పశ్చిమ ఫర్హా ప్రావిన్స్లో కాందహార్-హెరాత్ జాతీయరహదారిపై బుధవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందారు. భద్రతా దళాలు, పోలీసులే లక్ష్యంగా చేసిన ఈ దాడిలో సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. దాడి తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.