కేబుల్ టీవీ ఇక రూ.160కే అన్ని ఉచిత చానెళ్లు!
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రారు) శుభవార్తను వెల్లడించింది. కేబుల్, ప్రసార సేవల ధరలను హేతుబద్దీకరిస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కేబుల్ టీవీ ప్యాకీజీలను సవరించింది. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో మరిన్ని చానెళ్లను అందుబాటులోకి తెచ్చే విధంగా పలు సవరణలు చేసింది. సవరించిన ధరలు.. మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సవరణల అనంతరం ఉచిత చానెళ్లను పొందటానికి వినియోగదారులు చెల్లించాల్సిన గరిష్ట మొత్తాన్ని ట్రారు రూ.160గా నిర్ణయించింది. ఇక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలు ఉన్నవారికి లబ్ధి కలిగేలా కూడా ట్రారు ధరలలో మార్పులు చేసింది. అంతేకాకుండా 200 చానెళ్లను పొందటానికి వినియోగదారులు చెల్లించాల్సిన అత్యధిక మొత్తాన్ని పన్నులు కాకుండా రూ.130గా సంస్థ నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తప్పనిసరి అని ప్రకటించిన చానెళ్లు లెక్కలోకి రావు. ఒకే వ్యక్తి రెండు లేదా అపైన కనెక్షన్లను పొందాలంటే ఒక్కో కనెక్షన్కు నెట్వర్క్ కెపాసిటీ ఫీజులో (ఎన్సీఎఫ్) 40శాతం మొత్తాన్ని మాత్రమే అదనంగా చెల్లించాల్సి ఉండేలా ట్రారు టారీఫ్లను సవరించింది. ఇక ఆరు నెలలు, ఆపైన దీర్ఘకాలిక సభ్యత్వం తీసుకున్న వినియోగదారులకు ఆపరేటర్లు డిస్కౌంట్లు ఇచ్చేలా ట్రారు నిబంధనలను సవరించింది. దీంతో రానున్న రోజుల్లో డీటీహెచ్ సేవలు గణనీయంగా దిగివచ్చే అవకాశం కనిపిస్తోంది.