భరత్ అంత్యక్రియలకు రవితేజ హాజరుకాలేదు.. .. జూనియర్ ఆర్టిస్టుతో తలకొరివి!
ప్రముఖ సినీ హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఉదంతంలో అందరి దృష్టి కేంద్రీకృతం అయింది… అంత్యక్రియలకు రవితేజ హాజరుకాకపోవడం. ప్రమాదాన్ని గుర్తించిన అనంతరం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం డెడ్ బాడీని మహాప్రస్థానానికి తరలించారు. భరత్ అంత్యక్రియలు జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి రవితేజ హాజరుకాలేదు.
తన తమ్ముడి భరత్తో 30 ఏళ్ల అనుబంధాన్ని రవితేజ ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం భరత్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ కూడా హాజరుకాలేదని తెలిసింది.
భరత్ మృతివార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. అంత్యక్రియలకు హాజరుకాలేం. తమ పరిస్థితిని అర్థం చేసుకోండి అని రవితేజ మీడియాను మిత్రులను కోరారు. దీంతో తొలుత ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన భరత్ భౌతిక కాయాన్ని అక్కడి నుంచి నేరుగా మహా ప్రస్థానానికి తరలించారు.
సినీనటుడు భరత్ అంత్యక్రియలకు ఆయన సోదరుడు రవితేజ సహా చాలా మంది కుటుంబీకులు హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ప్రమాదంలో భరత్ ముఖం పూర్తిగా ఛిద్రమైపోయినందున అది చూసి మేం తట్టుకోలేమని, అందుకే అంత్యక్రియలకు రాలేనని రవితేజ ప్రకటించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డ్రగ్స్,కు బానిసై, కుటుంబ సభ్యుల మాటలను పెడచెవిన పెట్టడం వల్లే.. అందరూ ఉండికూడా భరత్ అనాధలా పోవాల్సివచ్చిందనే చర్చకూడా నడుస్తున్నది.
కుటుంబ సభ్యులెవరూ రాలేని పరిస్థితిలో భరత్ భౌతికకాయానికి ఓ జూనియర్ ఆర్టిస్టుచేత అంత్యక్రియలు జరిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం అతనికి రూ.1500 ఇచ్చినట్లు, పిల్లల స్కూలు ఫీజుల కోసమే అతనా పని చేయడానికి ముందుకొచ్చినట్లు, ఈ విషయం జూనియర్ ఆర్టిస్టే స్వయంగా చెప్పినట్లు ప్రచారం సాగుతున్నది.
రవితేజ మూడో సోదరుడు రఘు అంత్యక్రియలను పర్యవేక్షించారు. అంత్యక్రియలకు నటులు ఉత్తేజ్, జీవిత రాజశేఖర్, ఆలీ, రఘుబాబు, కుటుంబ సభ్యులు, పలువురు సమీప బంధువులు, మిత్రులు మాత్రమే హాజరయ్యారు.