‘గరుడవేగ’ విజయోత్సవంలో హీరో రాజశేఖర్ ఫ్యామిలీ.. యాక్సిడెంట్ చేసిన శివాని
సినీనటుడు రాజశేఖర్ కుమార్తె శివానిపై హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిలిపి ఉన్న కారును జీవితా రాజశేఖర్ కారు ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.73లో జీవితా రాజశేఖర్ కుమార్తె లాండ్ క్రూయిజర్ ఏపీ 13ఈ 1234 కారు నడుపుతూ వస్తూ అదే రోడ్డులో ఓ ఇంటి ముందు నిలిపిన కొత్త జీప్ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో జీప్ కారు పక్కనే ఉన్న గోడను బలంగా తాకి స్తంభానికి ఢీకొని నిలిచిపోయింది. ఈ ఘటనలో జీప్ ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న జీవిత అక్కడికి చేరుకొని దెబ్బతిన్న కారు యజమానితో మాట్లాడారు.
కాగా, ఇటీవలే 30 లక్షల రూపాయలతో కొత్త కారును కొనుగోలు చేశామనీ, ఇపుడు రాజశేఖర్ కుమార్తె కారుతో ఢీకొట్టడం వల్ల కారు బాగా దెబ్బతిందని, అందువల్ల రూ.30 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రమాదానికి సంబంధించి హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేయలేదు.
ఆ కారు యజమాని ఎస్పీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ఆపరేషనల్ మేనేజర్ అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. శివానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. శివాని యాక్సిడెంట్ గురించి శనివారం రాత్రే వార్తలు వచ్చినప్పటికీ.. కేసు నమోదు కాకపోవడంతో అధికారికంగా వెలుగులోకి రాలేదు.