దేశంలో కొత్తగా 75 ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు
వైద్యుల కొరత తీర్చేందుకు దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో కొత్తగా 75 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని బుధవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల మూడో దశలో భాగంగా వీటిని జిల్లా స్థాయి, రిఫరల్ ఆసుపత్రులకు అనుబంధంగా ఏర్పాటు చేయనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి ఏర్పాటు కోసం 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. కేంద్రం తన వాటాగా వచ్చే మూడేళ్లలో రూ.24,375 కోట్లు ఇస్తుంది. దీనివల్ల కొత్తగా 15,700 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరింత మంది వైద్యులు అందుబాటులోకి వస్తారని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటివరకు వైద్యకళాశాలలు లేని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. గత అయిదేళ్లలో 85 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వేగాన్ని పెంచి వచ్చే మూడేళ్లలోనే 75 ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు.