నాలుగోసారి విజయవంతమైన చంద్రయాన్-2 కక్ష్య పెంపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్సెంటర్ షార్ కేంద్రం నుంచి గత నెల 22న ప్రయోగించిన చంద్రయాన్–2 మిషన్కు సంబంధించి శుక్ర వారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట ర్లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. బెంగళూరు సమీపంలో బైలాలులో ఉన్న భూ నియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్–2 మిషన్లోని ఆర్బిటర్లో నింపిన ఇంధన సాయంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను నాలుగోసారి కూడా విజయవంతంగా నిర్వహించారు. చంద్రయాన్–2 మిషన్ రోదసీలో ఆరోగ్యకరంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్ర వేత్తలు అధికారికంగా వెల్లడించారు.
తాజాగా శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. ఆగస్టు 20 కల్లా చంద్రయాన్-2 చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరనుంది. అనంతరం చంద్రయాన్-2 నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయి చంద్రుడి ఉపరితలంపై దిగనుంది.