చినజీయర్ ఎపిసోడ్ ఇప్పుడా చెప్పేది రేవంత్?

ఏదైనా జరిగితే వెంటనే స్పందిస్తే ఆ వేడి వేరుగా ఉంటంది. అప్పుడెప్పుడోజరిగిపోయి.. జనాల మనసులో సరిగా రిజిష్టర్ కాని అంశంపై గళం విప్పితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీరు కూడా ఇదే తరహాలో ఉంది. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ మధ్యనే జరిగిన ఒక ఉదంతాన్ని రేవంత్ ప్రత్యేకంగా ప్రస్తావించి.. తెలంగాణ సీఎం తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ గృహప్రవేశం సందర్భంగా ముఖ్యమంత్రి సీట్లో చినజీయర్ స్వామిని కూర్చోబెట్టటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన కేసీఆర్ తీరుతో.. తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన విద్యార్థుల ఆత్మలు ఘోషిస్తున్నట్లుగా మండిపడ్డారు.

తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేయటం కోసం ఉన్న సచివాలయాన్ని కూల్చేసి.. రూ.1200 కోట్లతో కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా ఆరోపించారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయని కేసీఆర్.. సెల్ఫీలతో కేటీఆర్.. సెల్ఫ్ డబ్బాలతో కేసీఆర్ లు కాలక్షేపం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతు పోరుయాత్ర తరహాలోనే త్వరలోనే తెలంగాణలో విద్యార్థి పోరుయాత్రను త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.

గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3224 ప్రాథమిక పాఠశాలలను.. 260 కళాశాలల్ని ప్రభుత్వం మూసివేసిన విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చిన రేవంత్.. అదే సమయంలో బార్లకు మాత్రం భారీగా లైసెన్స్ లు ఇచ్చారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏది ఏమైనా.. గృహప్రవేశం సందర్భంగా తన సీటులో చినజీయర్ స్వామిని కూర్చోబెట్టిన వైనాన్ని బాహాటంగా తప్పు పట్టిన నేతగా రేవంత్ నిలవటం ఖాయం. కాకుంటే.. విమర్శ ఎంత పదునుగా ఉన్నా.. టైమ్లీగా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *