తెలంగాణను ఆశీర్వదించండి..రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌కు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి..

సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రంగా ఏర్ప డి, అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను ఆశీర్వదించాలని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికి తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నదని పునరుద్ఘాటించారు. కోవింద్ భారీ మెజారిటీతో గెలువడం తథ్యమని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ వచ్చిన రామ్‌నాథ్ కోవింద్.. నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.

తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు మొట్టమొదటి మద్దతు ప్రకటన చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని గుర్తుచేశారు. నామినేషన్ సమయంలోనూ మద్దతు తెలిపేందుకు కేసీఆర్ హాజరుకావడం సం తోషం. అందరికీ నా ధన్యవాదాలు. రాష్ట్రపతి పదవిని సమర్థంగా నిర్వహిస్తా. నా అభ్యర్థిత్వానికి మద్దతివ్వండి అని కోవింద్ కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ దేశ అత్యున్నత పదవికి రామ్‌నాథ్ కోవింద్ పేరును టీఆర్‌ఎస్ తరఫున సమర్థించడం గర్వంగా ఉందన్నారు. మీ అనుభవం, కార్యదీక్షతో రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. భారత గణతంత్ర ప్రజాస్వామ్య విలువలను పెంచుతారని ఆశిస్తున్నాం.

భారత్‌ను ఆర్థికవృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ ఆచరిస్తున్న విధానాలకు.. సమాఖ్య స్ఫూర్తిని కనబరుస్తూ టీఆర్‌ఎస్ సహకరిస్తున్నది. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. టీఆర్‌ఎస్ తరఫున మరోసారి మద్దతు తెలియజేస్తున్నాం. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రగతికి మీ ఆశీర్వాదం, మార్గదర్శకత్వం కోరుకుంటున్నాం.

రాష్ట్రపతిగా మీకు విజయం కలుగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్ చెప్పారు. సుదీర్ఘ పోరాటం తరువాత ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఏర్పడ్డప్పుడు మా ముందు ఎన్నో సమస్యలున్నాయి. విద్యుత్ కొరత పెద్ద సమస్యగా ఉండేది. ప్రతి రోజూ విద్యుత్ కోతలుండేవి. కానీ ఈ సమస్యను పరిష్కరించుకున్నాం. అంతేకాదు తెలంగాణ ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అని కేసీఆర్ అన్నారు. చాలా తక్కువ సమయంలోనే భారత్‌లోని అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణను నిలిపామని తెలిపారు. 17.8% వార్షిక ఆదాయం వృద్ధి రేటుతో భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ కొనసాగుతున్నది.

సంక్షేమంలోనూ భారత్‌లోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం 38లక్షల మందికి నెలనెలా రూ.1000 చొప్పున పింఛను ఇస్తున్నది. ఇతర పథకాలద్వారా పేద ప్రజల సంక్షేమంకోసం కృషిచేస్తున్నాం. ఎస్టీ, ఎస్సీల అభివృద్ధికి ఈ ఏడాది రూ.22,400 కోట్లతో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించి, దాని అమలుకు కొత్త చట్టం తెచ్చాం. పేదలకు నివాసం కోసం ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నాం. దీనిద్వారా సమాజంలో పేదల గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ పారిశ్రామికవృద్ధి కోసం.. పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ తీసుకువచ్చామని చెప్పారు. దీనిద్వారా ఇప్పటికే 4026 దరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇచ్చామన్నారు. ఈ విధానాన్ని ప్రపంచంలోని పలు దేశాలు కీర్తించాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత రెండేండ్లుగా తెలంగాణ రాష్ట్రం భారత ప్రభుత్వం నుంచి మొదటి ర్యాంకు అందుకున్నదని గుర్తుచేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *