ఆర్టీసీ కార్మికులతో సీఎం తన హోదాను పక్కనబెట్టి ఆత్మీయ సమావేశం
ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులతో సీఎం ఆత్మీయ సమావేశం. వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు అనంతరం కార్మికులకు సెప్టెంబర్ నెల జీతం.. ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమ్మె చేసిన 55 రోజుల పూర్తి జీతం కూడా ఇప్పిస్తానని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలని ఆదేశించారు. తన హోదాను పక్కనబెట్టి వారితో సరదాగా మాట్లాడారు. రామాయణ యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు.. తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగారు. దీనికి రాముడు బదులిస్తూ.. కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండన్నారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారు. వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ్మె కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబీకులకు 8 రోజుల్లోగా వారి అర్హతల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.