కేంద్ర కీలక నిర్ణయాలు…లాభాల్లో స్టాక్ మార్కెట్
ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇచ్చేందుకు కార్పొరేట్ పన్నుల్లో కోత విధించారు. దేశీయ కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్ ను 30 నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నూతన కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ను 25 శాతం నుంచి 15 శాతం తగ్గించారని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా రామన్ అన్నారు. 2019 అక్టోబర్ 1 తర్వాత తయారీ రంగంలో తాజా పెట్టుబడులతో ప్రారంభించే దేశీయ కంపెనీలకు కేవలం 15 శాతం ఆదాయ పన్ను చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థలో జోరు పెంచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉత్పత్తి రంగంలోకి పెట్టుబడులను ముమ్మరం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా కేంద్రం ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్ల లాభంతో 37,550 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 424 పాయింట్ల లాభంతో 11,128 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.