సంక్రాంతి ఓటర్లకు డబుల్ దామకా…..
హైదరాబాద్/ అబ్దుల్లాపూర్మెట్ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు, సంక్రాంతి పండుగ ఒకే సారి రావడంతో ఓటర్లకు డబుల్ దామకాగా మారింది. ఓటర్లకు ఏ మాత్రం పండగ ఖర్చు లేకుండా చూసేందుకు అభ్యర్థులు తమదైనా శైలిలో మొదటి విడత పంపిణీ కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డులలో ఓటర్లకు ప్రధానంగా స్లమ్ వార్డులలోని ఓటర్లను గుర్తించి వారికి పండగ ఖర్చులను సమకూర్చే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఓటర్ల జేబులో నుంచి రూపాయి ఖర్చు కాకుండా మొదటి విడతలో వారికి పండుగ ఇనాంగా డబ్బులను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే, మద్యం కూడా సరఫరా చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల అభ్యర్థులు ఏరియాకు కొంత మంది అనుచరులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఈ తతాంగం నడిపించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. బుధవారం పండుగ ఉండడంతో ఒక రోజు ముందే వారికి అవసమైనా డబ్బులను, మద్యంను అందజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల్లో ట్రెండ్ మారింది. అభ్యర్థి ఒకేసారి మద్యం డంప్ చేస్తే ప్రత్యర్థులు పోలీసులకు సమాచారం ఇస్తారనే భయంతో అభ్యర్థులు రూట్ మార్చారు. ఈ క్రమంలో వైన్స్పాపుల వారితో ముందుగా మాట్లాడుకుంటున్నారు. ఫలానా వైన్స్కు వెళ్లి మద్యం తీసుకోవాలని ఓటర్లకు టోకెన్లు ఇస్తున్నారు. దీంతో ఓటర్లు నేరుగా ఆ వైన్షాపునకు వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు.