మోడీ సర్వేపై అనుమానాలు

పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికీ రాజకీయ పార్టీలు – నేతలు ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు.  అయితే దీనిపై విమర్శలు వస్తుండడంతో సొంత పార్టీలోనూ అక్కడక్కడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. మోడీ తన మొండితనంతో ఏకపక్షంగా నిర్ణయించేసి.. ఈ నిర్ణయాన్ని ప్రకటించేశారన్న భావన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. తీరా ప్రజల్లో అలజడి చెలరేగిన నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారన్న అభిప్రాయం విపక్షం – స్వపక్షంలోనూ వినిపిస్తోంది. తాజాగా మోడీ వెల్లడించిన సర్వే ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల కష్టాలను దేశమంతా చూస్తున్న సమయంలో అందుకు భిన్నమైన ప్రజాభిప్రాయాన్ని మోడీ ప్రొజెక్టు చేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ముఖ్యంగా సర్వే ప్రశ్నావళిలో అడిగిన ప్రశ్నలు కూడా ఏకపక్షంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం పది ప్రశ్నల జాబితాలో.. నల్లధనంపై యుద్ధం చేయాలా వద్దా? పెద్ద నోట్ల రద్దుపై మీ అభిప్రాయమేమిటి? వంటి ప్రశ్నలను ప్రజలకు సంధించడంతో ఎవరైనా ఔననే అంటారని చెబుతున్నారు. వ్యతిరేక సమాధానానికి అవకాశం లేని ప్రశ్నలే అడిగారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సూటి ప్రశ్నలకు బదులు పరోక్ష ప్రశ్నలను సంధించి.. వాటికి సూటి సమాధానాలు రాబట్టడం ద్వారా తన నిర్ణయం కారణంగా ఎవ్వరూ ఇబ్బందులు పడటం లేదని సామాన్యుడే ఒప్పుకుంటున్నాడని ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఈ ప్రశ్నావళి రూపొందించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం ప్రశ్నావళిలో సామాన్యుడి ఇబ్బందుల గురించి ఒకే ఒక ప్రశ్న ఉంది. అదీ ముక్కుసూటి ప్రశ్న కాదు. ప్రధాని మోడీకి నిజంగా సామాన్యుడి అగచాట్ల గురించి శ్రద్ధ ఉండి ఉంటే ఈ ప్రశ్నావళి మరోరకంగా ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మోడీ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలిస్తే.. ఆయన నిర్ణయం దరిమిలా దేశమంతా ప్రశాంతతతో.. మనశ్శాంతితో అలరారుతున్న భావన కలగడం సహజమని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పది ప్రశ్నల్లో కనీసం ఐదు ప్రశ్నలైనా క్షేత్రస్ధాయిలో సాధకబాధకాల గురించి ప్రస్తావించకుండా తన నిర్ణయానికి మద్దతు కూడగట్టేలా ప్రశ్నలు తయారు చేయించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు నానాటికీ తీవ్రమవుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్న దశలో ప్రధాని ఈ సర్వే ద్వారా వారిపై ఎదురుదాడికి సన్నద్ధం అవుతున్నారని అంటున్నారు.

మోడీ సర్వేలే అడిగిన ప్రశ్నలు ఇవీ..

1. దేశంలో నల్ల ధనం ఉందని మీరు భావిస్తున్నారా?

2. నల్లధనం – అవినీతిని గుర్తించి ఏరిపారేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా?

3. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలపై మీ అభిప్రాయమేమిటి?

4. అవినీతిపై మోడీ ప్రభుత్వం స్థూలంగా చేసిన – చేస్తున్న చర్యలకు మీ రేటింగ్ ఎంత: (1-5)

5. ఐదొందలు – వెయ్యి నోట్లను రద్దు చేయడంపై మీ అభిప్రాయమేమిటి?

6. ఈ రద్దుతో నల్లధనం – అవినీతి – ఉగ్రవాదాన్ని ఏరిపారేయవచ్చా?

7. రియల్ ఎస్టేట్ – విద్య – ఆరోగ్య పరిరక్షణ వంటివి సామాన్యుడికి ఈ చర్చతో అందుబాటులోకి వస్తాయా?

8. అవినీతి – నల్లధనం – ఉగ్రవాదం – దొంగనోట్లను ఏరేయడంలో మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా?

9. అవినీతి – నల్లధనం – ఉగ్రవాదానికి మద్దతుగా కొందరు అవినీతి వ్యతిరేకులు పనిచేస్తున్నారని భావిస్తున్నారా

10. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని మోడీకి మీరేమైనా సలహాలు – సూచనలు ఇవ్వదలుచుకున్నారా?

దాదాపుగా ఈ ప్రశ్నలన్నీ ఖండించడానికి వీలు లేనివే.. నిజానికి ప్రజల కష్టాలు తెలుసుకునే ఉద్దేశమే కనుక ఉంటే ప్రశ్నలు వేరేలా రూపొందించాల్సి ఉంది.

ఇలా ఉంటే బాగుండేది…

1. నోట్ల రద్దు నిర్ణయం వెలువడి పదిహేను రోజులవుతున్నా మీరింకా ఇబ్బందులు పడుతున్నారా..?

2. రోజువారీ జీవితంపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించింది..

3. పాత నోట్లు మార్చుకోడానికి.. డబ్బు డ్రా చేయడానికి బ్యాంకుల ముందు – ఏటీఎంల ముందు ఎన్ని గంటలు క్యూల్లో నిలబడుతున్నారు?

4. నగదు రహిత లావాదేవీలు అందరికీ అందుబాటులో ఉన్నాయని మీరు భావిస్తున్నారా?

5. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో లొసుగులున్నాయని అనుకుంటున్నారా?

6. ఏర్పాట్లలో మేమేమైనా వైఫల్యం చెందామా?

7. సంపన్న – మధ్యతరగతి – నిరుపేదల్లో ఎవరిపై దీని ప్రభావం ఎక్కువగా పడిందనుకుంటున్నారు?

8. నల్లధనంపై పోరాటానికి ప్రజలను సన్నద్దం చేయకుండా బరిలోకి దిగామా?

9. చిల్లర దొరక్కపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?

10. నోట్ల రద్దు నిర్ణయం వల్ల మీకు కలిగిన భారీ నష్టమేంటి?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *