ప్రతి నీటి బొట్టూ అమూల్యమైనదని అన్నగవర్నర్ తమిళిసై
ప్రతి నీటి బొట్టూ అమూల్యమైనదని గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రస్తుతం నీటి వ్యర్థాల నిర్వహణ దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి వ్యర్థాల నిర్వహణపై హైదరాబాద్లోని ఓ హోటల్ నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను ఆమె సోమవారం ప్రారంభించి సావనీర్ను ఆవిష్కరించారు. సాంప్రదాయ వ్యర్థాల నిర్వహణ పద్ధతుల ద్వారా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.నీటి వ్యర్థాల నిర్వహణపై ప్రజల ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు. నీటి వ్యర్థాల నిర్వహణలోని సమస్యలు పరిష్కరించడానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దీనిపై చర్చించడానికి విదేశీయులతో పాటు స్వదేశీ ప్రతినిధి బృందాన్ని రాజ్ భవన్కు గవర్నర్ ఆహ్వానించారు. నీటి వ్యర్థాల శుద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. భారతదేశంలోని కాస్మొపాలిటన్ నగరాల్లో 3,600 కోట్ల లీటర్ల నీటి వ్యర్థాలు వెలువడుతున్నాయన్నారు. చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులు కలుషితం కావడంతో 30-90 హెక్టార్ల సాగుభూమి ప్రమాదంలో పడుతోందని గణాంకాలు చెబుతున్నాయని వివరించారు. చేతులు శుభ్రం చేసుకునే సమయంలో ధారాళంగా నీరు వృథా అయ్యే విధంగా ట్యాప్ ఓపెన్ చేయొద్దని తన తండ్రి తరచూ తనకు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.