అక్టోబర్ 21నా హుజూర్ నగర్ ఉపఎన్నిక
దేశవ్యాప్తంగా జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. తెలంగాణలోని హుజూర్నగర్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చత్తీస్ఘర్, అస్సామ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిషా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు రాష్ట్రాల్లో ఉపఎన్నికలున్నాయి. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదలకాగా, నామినేషన్ల దాఖలుకు ఈనెల 28 చివరి తేదీగా ప్రకటించారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలనకాగా, అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 24న ఫలితాలు విడుదలకానునట్టు సీఈసీ తెలిపారు.
మరోవైపు తెలంగాణలో ఉపఎన్నిక జరగనున్న ఏకైక స్థానం కావడంతో ప్రధాన పార్టీలన్నీ హుజూర్నగర్పై ఫోకస్ పెట్టాయి. ఓ వైపు టిఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా నోటిఫికేషన్ వెలువడంతో రాష్ట్ర రాజకీయమంతా అక్కడే మకాం వేయనుంది. అయితే, నోటిఫికేషన్ వెలువడక ముందే ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఉప ఎన్నికలో తన అభ్యర్థి కిరణ్రెడ్డి అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా, ఉత్తమ్, జానా, నేను ఒక్కటయ్యామని, పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.