ప్రపంచకప్ విజయంపై స్పందించిన ఇయాన్ మోర్గాన్
ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన దాని ఫలితంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల పోరాటపటిమ ఎంత చెప్పినా తక్కువే. బంతిబంతికీ ఉత్కంఠ రేపిన కీలక పోరులో రెండు జట్ల స్కోర్లు సూపర్ ఓవర్లోనూ సమం కావడంతో ఇంగ్లాండ్ జట్టు బౌండరీల సంఖ్య ఆధారంగా విశ్వవిజేతగా నిలిచింది. దీనిపై ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లూ విజయం సాధించాయని చాలా మంది మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.
ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా తాజాగా స్పందించారు. ప్రపంచకప్ ఫైనల్స్ లో ఇరు జట్లు బాగా ఆడాయని కానీ స్పల్ప తేడాతో ఇలాంటి ఫలితం రావడం సరైంది కాదనిపిస్తోందని మోర్గాన్ అన్నాడు. ఇది తమకు కష్టంగా ఉందని పేర్కొన్నారు. సూపర్ ఓవర్లోనూ రెండు జట్ల స్కోరు సమం అయినప్పుడు బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ జట్టును టెక్నికల్గా విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయిన ఇలా బౌండరీల నిబంధన ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం తన దృష్టిలో సబబు కాదని మోర్గాన్ తేల్చి చెప్పాడు. ‘నేను ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నా. ఈ మ్యాచ్ ఫలితం పై వేలెత్తి చూపలేను. ఇలా గెలవడం మంచిదేనని అనను. కానీ విజయం ఎలా ఉన్నా మ్యాచ్ ఓడిపోయుంటే మాత్రం చాలా తీవ్రంగా కలచివేసేది’ అని పేర్కొన్నాడు. చివరగా ఇదో అద్భుతమైన మ్యాచ్గా సాగిందని, ఈ ఫలితం మాత్రం పిచ్చెక్కించిందని తెలిపాడు. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో చాలాసార్లు మాట్లాడానని చెప్పారు. మ్యాచ్ తర్వాత కేన్ విలియమ్సన్ చిరునవ్వుతో ఓటమిని స్వీకరించగా అందరూ అతడిని ప్రశంసించారు. కివీస్ జట్టు కప్పు గెలవకపోయినా క్రికెట్ ప్రేమికుల అభిమానం గెలుచుకుంది.