కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం
కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్ సపోర్ట్పై ఉంచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు శనివారం తెలిపారు. ఈ నెల 9న ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆయన ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు శనివారం జైట్లీని పరామర్శించారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఎయిమ్స్కు చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఆసుపత్రిని సందర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, సహాయమంత్రి అశ్విని చౌబేలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్లు కూడా ఆసుపత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.