నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలు
న్యూఢిల్లీ : 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి దేశ రాజధాని హస్తినలో కదిలే బస్సులో నిర్భయపై దారుణానికి పాల్పడ్డ రాక్షస మూకకు చావు తేదీ ఖరారైంది. నిర్భయపై అతి కిరాతకంగా లైంగిక దాడి చేసి.. ఆమె మరణానికి కారణమైన నలుగురు దోషుల్ని జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు మంగళవారం డెత్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. తీహార్ జైల్లోని మూడో నంబర్ జైల్లో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.
నిర్భయ దోషుల్ని ఉరి తీసేందుకు ఉత్తరప్రదేశ్ లోని మీరట్కు చెందిన తలారిని సంప్రదిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారు. అలాగే, బీహార్లోని బక్సర్ జైలు నుంచి మనీలా ఉరి తాళ్లని కూడా తెప్పిస్తున్నట్టు వాళ్లు పేర్కొన్నారు.నిర్భయ కేసులో దోషులకు ఢిల్లీ కోర్టు డెత్ వారంట్ జారీ చేయడంపై నిర్భయ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేసింది. ఈ కేసులో నలుగురు దోషులను శిక్షించడం ద్వారా దేశంలోని స్త్రీలకు సాధికారత లభించినట్టు అయింది’ అని పేర్కొన్నారు. నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి నేరాలు చేసే వారికి ఈ తీర్పు భయాన్ని కలిగించాలన్నారు. నిర్భయ తాతయ్య మాట్లాడుతూ.. ఆలస్యమైనప్పటికీ తమకు న్యాయం జరిగిందని, కోర్టు ఆదేశాలు తమకు ఉపశమనాన్నిచ్చాయని చెప్పారు.