హైదరాబాద్, కొంపల్లి ఎన్నికల లో ముఖ చిత్ర గుర్తింపు ఆప్
హైదరాబాద్, కొంపల్లి, ఎన్నికల కమిషన్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన మొబైల్ టీ ఫోలియో యాప్ (ఫేస్ రికగ్నిషన్ యాప్) విజయవంతమైంది. దేశంలోనే తొలిసారిగా మేడ్చల్ జిల్లా కొంపల్లి మునిసిపాలిటీలోని 10 పోలింగ్ కేంద్రాల్లో యాప్ను ప్రయోగించగా ఎన్నికల అధికారుల అంచనాలకు మించి విజయవంతమైంది. ఓటర్లు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఎన్నికల్లో తొలిసారి వినియోగించిన ఈ పరిజ్ఞానాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ముఖం ఆధారంగా ఓటు వేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇక్కడే ప్రారంభించడంతో 6 వార్డుల పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాల ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం మునిసిపాలిటీలో 66.03 శాతం పోలింగ్ నమోదవగా, ఈ 10 పోలింగ్ కేంద్రాల్లో 73.54% నమోదవడం విశేషం. నూతన విధానం దాదాపు 75% విజయవంతమైంది. 25%మంది ఫొటోలను సాఫ్ట్వేర్ తిరస్కరించింది. ఈసీ డేటాబే్సలో ఉన్న ఫొటోలు చాలా పాతవి కావడం, పోలింగ్ కేంద్రంలోని గదిలో వెలుతురు లేకపోవడం, తదితర కారణాలతో నాలుగో వంతు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని ఈ ఎన్నికలను పర్యవేక్షించిన ఐటీ నిపుణులు తెలిపారు. సిగ్నల్ సరిగా లేకపోవడంతో మూడు కేంద్రాల్లో రెండు మూడు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఇక్కడి కేంద్రాలను పరిశీలించి.. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు.