బ్యాంకుల విలీనం అందుకేనా…
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న విషయం ఆర్దిక మందగమనం. ఇప్పుడు మన దేశన్ని కూడా భయపెడుతుందా అంటే అవుననే అనాలి ఎందుకంటే మన దేశంలో నిరుద్యోగం పెరిగింది. వున్న ఉద్యోగాలు పోతున్నాయి. వాహన విక్రయాలు తగ్గాయి. ఈ పర్యవాసనలన్నీ దానికే సూచికా?… తాజాగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు తెరలేపింది. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ను విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏర్పడనున్నట్లు వెల్లడించారు.
కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్గా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ను కలిపి ఐదో అతిపెద్ద బ్యాంక్గా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ బ్యాంక్ను అలహాబాద్ బ్యాంక్లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనున్నట్లు తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దడంలో భాగంగా ఈ విలీనం జరుగుతుంది. తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలన్నీ సడలించారు. రాబోయే ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ఉద్దీపనలు ప్రకటిస్తోంది.