బాహుబలి-2లో ఐదు తప్పులున్నాయి: దర్శకుడు విఘ్నేష్
గత నెల 28న విడుదలైన బాహుబలి-2 సినిమా సంచలనం సృష్టించే దిశగా దూసుకుపోతోంది. అక్కడక్కడ కొన్ని విమర్శలు ఎదురవుతున్నా మెజారిటీ జనాలు మాత్రం బాహుబలి-2ను ఆదరిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా బాహుబలి-2ను, దర్శకుడు రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ బాహుబలి-2లోని ఐదు తప్పులను పసిగట్టి వాటిని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అవేంటో చూద్దాం..
1) బాహుబలి-2 సినిమాను కేవలం 120 రూపాయలకే చూడాల్సి రావడం మొదటి తప్పు. అందుకు ప్రతిగా నిర్మాత కోసం ప్రతీ థియేటర్ దగ్గరా ఓ కలెక్షన్ బాక్స్ను ఏర్పాటు చేయాలి.
2) సినిమా రన్టైం చాలా తక్కువగా ఉంది. కేవలం మూడు గంటల్లోనే సినిమా పూర్తయిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
3) ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే చివరి సినిమా అవడానికి వీల్లేదు. ఈ సిరీస్లో మరో పది సినిమాలను చూడాలనుకుంటున్నాం.
4) టూ మచ్ డిటెయిలింగ్ అండ్ పర్ఫెక్షన్. ఈ దెబ్బతో తాము గొప్పవాళ్లమని విర్రవీగే దర్శకులందరూ తమ హెడ్ వెయిట్ను తగ్గించుకోవాల్సి ఉంటుంది.
5) బెంచ్మార్క్ను సెట్ చేయడం చాలా కష్టం. ఈ రికార్డులను అధిగమించాలంటే చాలా ఏళ్లు పడుతుంది.
ఇవీ సోషల్ మీడియాలో బాహుబలి-2లోని తప్పులంటూ విఘ్నేష్ శివన్ రాసినవి. నిజానికి తప్పులను ఎత్తిచూపుతున్నానని చెప్పాడు గానీ, పరోక్షంగా రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాడు. బాహుబలి-2 చూసి అందరూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్న నేపథ్యంలో విఘ్నేష్ ఇలా క్రియేటివ్గా తన ప్రశంసలను అందించాడన్నమాట.