భారత్ లో ఆశ్రయం కోరుతున్న పాక్ మాజీ ఎమ్మాల్యే
పాకిస్తాన్ ప్రధాని తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు భారత్లో రాజకీయ ఆశ్రయం కల్పించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీటీఐ తరఫున ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్లోని బారికోట్ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బల్దేవ్ కుమార్(43) పాక్లో మైనారిటీలకు రక్షణ లేదని ఆరోపించాడు. ఈ క్రమంలో భారత్లో తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం బల్దేవ్ మూడు నెలల వీసాపై భారతదేశంలో ఉన్నాడు. ఆగస్టు 12న ఆయన భారతదేశానికి వచ్చాడు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో సహ భారత్ లోని లూధియానా సమీపంలోని ఖన్నా అనే ప్రాతంలో ఉన్నారు. తన కుటుంబ భద్రత గురించి భయపడుతున్నానని అందుకే భారతదేశంలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నానని బల్దేవ్ తెలిపాడు.
ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ మీద విమర్శల వర్షం కురిపించాడు బల్దేవ్. నూతన పాకిస్తాన్ను నిర్మిస్తానని ప్రమాణం చేసిన ఇమ్రాన్ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించాడు. పాక్లో హిందువులు, సిక్కులపై దారుణాలు జరుగుతున్నాయని వివరించాడు. ఓ వైపు కాశ్మీర్ లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘన్ పాల్పడుతోందని పాక్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బాల్ దేవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2016 జరిగిన ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ ఎమ్మెల్యే సోరన్ సింగ్ హత్య కేసులో తనను ఇరికించి వేధిస్తున్నరాని చెప్పాడు. బల్దేవ్ కుమార్ 2007లో పంబాజ్ ఖన్నా ప్రాంతానికి చెందిన భావనను వివాహం చేసుకున్నాడు. ఆమెకు భారతీయ పౌరసత్వం ఉంది.