తెలంగాణాలో మరో బాట్లింగ్ ప్లాంట్?

తెలంగాణాలో మరొక గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయవలసిందిగా తెరాస ఎంపిల అభ్యర్ధనకు కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ సంస్థకు రాష్ట్రంలో ఒకటే గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ ఉన్నందున దానిని కరీంనగర్ జిల్లాలో కమలాపూర్, జమ్మికుంట, ఎల్కతుర్తి వద్ద గానీ లేదా కరీంనగర్-వరంగల్ రైల్వే లైన్ సమీపంలో గల ఉప్పల్ వద్ద గానీ ఏర్పాటు చేయవలసిందిగా తెరాస ఎంపిలు కోరారు. అందుకు  సానుకూలంగా స్పందించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి తెలంగాణాలో రెండవ ప్లాంటు ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించవలసిందిగా కోరారు.

హెచ్.పి.సి.ఎల్., బిపిసిఎల్ సంస్థలకు చర్లపల్లిలో ఇప్పటికే చెరో ప్లాంటు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కు మహబూబ్ నగర్ లో తిమ్మాపూర్ వద్ద ప్లాంట్ ఉంది. ఈ మూడు గ్యాస్ బాట్లింగ్ ప్లాంటులలో ఏడాదికి 6,28,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఫిల్లింగ్ చేస్తూ సుమారు 20 లక్షల మంది ప్రజల అవసరాలు తీరుస్తున్నాయి. కానీ నానాటికీ జనాభా పెరుగుతున్న కారణంగా అది సరిపోవడం లేదు. కనుక  హిందూస్తాన్ పెట్రోలియం సంస్థ కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట వద్ద 60 టన్నుల సామర్ధ్యం గల తన రెండవ ప్లాంటును స్థాపించబోతోంది.

బిపిసిఎల్  రెండవ ప్లాంటు ఏర్పాటుకు కేంద్రమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు కనుక త్వరలోనే అదీ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఇది ఏర్పడినట్లయితే మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు రాష్ట్రంలో రెండేసి బాట్లింగ్ ప్లాంట్లు ఉంటాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *