ట్రంప్ నుంచి ఇండియాకు క్లారిటీ వచ్చిందా..?

హెచ్ 1బీ వీసాల వ్యవహారంతో అమెరికాలోని భారతీయులు తెగ భయపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కూడా అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజా పరిణామాలన్నీ అక్రమ వలసలను అడ్డుకోవడానికే కానీ భారతీయులను అడ్డుకోవడం కోసం కాదని అమెరికన్ ఉన్నతాధికారులు ఇండియాకు స్పష్టం చేశారని తెలుస్తోంది.  హెచ్1బీ వీసాలపై భారత నిపుణుల్లో నెలకొన్న ఆందోళనల్ని తగ్గించే క్రమంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే ఈ సంగతి తెలిపారు.

హెచ్1బీ వీసాలపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో సంప్రదింపులు కొనసాగిస్తామని బాగ్లే వెల్లడించారు.  భారతీయుల నైపుణ్యంపై అమెరికాలో బలమైన గుర్తింపు గౌరవం ఉన్నాయని.. అలాగే అమెరికా ఆర్థిక రంగానికి భారత్ సాంకేతిక నిపుణులు సాయం చేస్తున్నారన్న అభిప్రాయం అక్కడి ఉన్నతాధికారులతో చర్చల్లో వ్యక్తమైందన్నారు. హెచ్1బీ వీసాల జారీ వాణిజ్య – వ్యాపార – ఆర్థిక అంశమని అమెరికాకు స్పష్టం చేశామని గోపాల్ తెలిపారు.

కాగా  ప్రీమియం (ఫాస్ట్ ట్రాక్) హెచ్1బీ వీసాల ప్రాసెసింగ్ ను తాత్కాలికంగా రద్దుచేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయం భారత అమెరికన్లకు తాత్కాలిక నష్టమేనని నిపుణులు అంటున్నారు. ప్రపంచబ్యాంకు మాజీ ఆర్థిక వేత్త కౌశిక్ బసు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.  ‘హెచ్1బీ వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం భారత్ కు కాస్త ఇబ్బందికరమే అయినా తర్వాత మేలు జరుగుతుంది. కానీ అమెరికాకు మాత్రం తీవ్ర నష్టం కలిగిస్తుంది’ అని కౌశిక్ బసు ట్వీట్ చేశారు.

ఇదంతా ఎలా ఉన్నా అమెరికా అధికారులు మన విదేశాంగ శాఖకు ఇలాంటి క్లారిటీ ఇవ్వడం నిజమే అయితే అది మంచి పరిణామమే. అక్రమ వలసలను అడ్డుకోవడంపై ఎవరికీ అభ్యంతరం లేకున్నా అది భారత్ ఇమ్మిగ్రెంట్లకు ఇబ్బంది కలిగించకపోతే చాలని మన విదేశాంగ శాఖ అంటోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *