దండం పెట్టి మరీ విపక్షంపై హరీశ్ దండయాత్ర

ఫైర్ బ్రాండ్ తీరు.. అదును చూసి మరీ దెబ్బ తీసే లక్షణంతో పాటు.. బ్యాలెన్స్ మిస్ కాకుండా తెలివిగా ప్రత్యర్థిపై దాడి చేయటంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మొనగాడని చెప్పాలి. ఎప్పటికప్పుడు తన శైలిని మార్చేస్తూ.. పదునైన వాదనను వినిపిస్తూ.. తన మాటలతో రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే తత్త్వం హరీశ్ సొంతం. తాజాగా అలాంటి తెలివినే ప్రదర్శించి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు బీపీ తీసుకొచ్చారు మంత్రి హరీశ్.

సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ సాగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. విపక్షంపై నాటకీయంగా దాడి చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు..సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాకపోవటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్న హరీశ్.. ఆ పార్టీ నేతల్ని డిఫెన్స్ లో పడేస్తూ.. ‘‘దండం పెడుతున్నా. మా మీద కోపం ఉంటే తిట్టండి.కానీ ప్రాజెక్టులను మాత్రం దయచేసి అపొద్దు. జనం ఉసురు పోసుకోవద్దు. ఇక.. మీ దయ. తెలంగాణకు అన్యాయం చేసే ఆక్రమ ప్రాజెక్టులకు.. అనుమతుల్లేని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి.. మంగళ హారతులు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమ్మిడి హెట్టి వద్ద నీరు లేనందునే.. ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ చేశాం. నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ 2015లో చెప్పింది. తమ్మిడి హట్టి వద్ద 270 టీఎంసీలు తీసుకుందామని అనుకున్నాం. కానీ.. 165 టీఎంసీలు మాత్రమే వస్తాయని సీడబ్ల్యూసీ చెప్పింది. అదే 152 మీటర్ల వరకూ కడితే 120 టీఎంసీలు వస్తాయని.. 148 వద్ద కడితే 44 టీఎంసీలే లభ్యతగా ఉంటాయని చెప్పింది’’ అంటూ వివరించారు.

ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినట్లుగా హరీశ్ మండిపడ్డారు. సిరిసిల్లలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన మహేందర్ రెడ్డి మల్లన్నసాగర్ పై చనిపోయిన వ్యక్తుల పేర్లతో కేసులు వేశారన్నారు. రెండేళ్ల క్రితం చనిపోయిన రైతులు ఆత్మలుగా వచ్చి.. కేసులు వేశాయా?అంటూ ప్రశ్నించిన యన.. కొల్హాపూర్ లో పోటీ చసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసు వేశారన్నారు.

‘‘అడవి ఉందన్నారు.పులులు చనిపోతాయని చెప్పిపాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నారు. నిజానికి అక్కడు పులులు కాదు కదా పిల్లులు.. తొండలు కూడా లేవు’’ అని హరీశ్ వ్యాఖ్యానించారు. చేతులు జోడించి..దండం పెడుతున్నానంటూ అగ్గి ఫైర్ అయిన హరీశ్ వాదనల్లో నిజాలేం లేవంటూ కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి.. డీకే అరుణలు తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. తమ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టు పనులే కొనసాగుతున్నాయని.. టీఆర్ఎస్ ప్రభుత్వం షురూ చేసిన పనులు ఒక్కటీ ముందుకు సాగటం లేదన్నారు. బీమా.. నెట్టెంపాడులో తాము 70 శాతం నుంచి 80 శాతం వరకూ నీళ్లు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించిన జానా.. దేవాదుల కింద నీళ్లు ఇచ్చామన్నారు. ఇదిలా ఉంటే.. హరీశ్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ.

కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టి.. చివరివరకూతీసుకొచ్చిన ప్రాజెక్టులను తామే పూర్తి చేసినట్లుగా మంత్రిహరీశ్ చెప్పటం హాస్యాస్పదమన్నారు. రెండేళ్లలో టీఆర్ఎస్ సర్కారు స్టార్ట్ చేసిన కొత్త ప్రాజెక్టులు ఎన్ని మొదలు పెట్టారో చెప్పాలంటూ నిలదీశారు. బీమా ప్రాజెక్టును తామ 2012లో పూర్తి చేసి..అప్పుడే నీరిస్తే.. మంత్రి హరీశ్ వచ్చి ఎలా ప్రారంభోత్సవం చేస్తారంటూ ప్రశ్నించారు. ఆవేశంలో కాంగ్రెస్ నేతలు అసలు పాయింట్ మర్చిపోవటం కనిపిస్తోంది. ఆ పేరు చెప్పి.. ఈ పేరు చెప్పి కాంగ్రెస్ నేతలు తాము స్టార్ట్ చేయాలన్న ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ హరీశ్ వాదిస్తుంటే.. ఆయన వాదనలకు బలం చేకూరేలా.. రెండేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారో చెప్పాలంటూ జానా.. డీకే అరుణలు ప్రశ్నించటం ఎంతవరకూ సబబు? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హరీశ్ వాదనను తిప్పి కొట్టే ప్రయత్నం చేయాలే తప్పించి.. ఇది దొరికిపోకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *