ఏపీ నష్టపోతున్నదెంతో చెప్పిన హరీశ్

అవసరం తెచ్చేమాటలు ఎలా ఉంటాయో తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాటల్ని వింటే ఇట్టే అర్థమైపోతాయి. తమ అవసరాలు తీర్చేందుకు అవసరమైతే.. పక్క రాష్ట్రానికి అయ్యే వృధా ఖర్చు గురించి హరీశ్ ఎంతలా మాట్లాడతారో తెలిపే ఉదంతంగా చెప్పాలి. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ భవనాల్ని తాము తీసేసుకొని.. ఇప్పుడున్న భవనాల్నికూల్చేసి.. సరికొత్త సెక్రటేరియట్ ను వాస్తుకు తగ్గట్లుగా నిర్మించుకోవాలన్నతపన ఎంతన్నది తాజాగా హరీశ్ మాటల్ని వింటే ఇట్టే అర్థమైపోతుంది.

విభజన నేపథ్యంలో ఆంధ్రా.. తెలంగాణ రాష్ట్రాలకు సమానంగా సెక్రటేరియట్ ను పంచిన సంగతి తెలిసిందే. ఏపీకి కేటాయించిన భవనాలకు వార్షికంగా పన్నులు.. విద్యుత్..నీటి బిల్లుల్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. అమరావతిలో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకొని.. ఏపీ ఉద్యోగులు దాదాపుగా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న సెక్రటేరియట్ వాస్తు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తమ భాగానికి వచ్చిన సచివాలయ భవనాలతో పాటు.. ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాల్ని తీసుకొని.. మొత్తంగా నేలమట్టం చేసేసి.. కలల సచివాలయాన్ని నిర్మించాలని తపిస్తున్నారు. ఇందుకు ఏపీకి కేటాయించిన భవనాల్నితీసుకోవటం పెద్ద సమస్యగా మారింది.

కొత్త సచివాలయ నిర్మాణానికి ఏపీ తనకు కేటాయించిన భవనాల్ని ఇచ్చేందుకు సిద్ధమే అయినా.. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీలన్నీ లెక్క తేలిపోతే ఇచ్చేస్తామన్న ధోరణిని ప్రదర్శిస్తోంది అయితే.. విభజన వివాదాలు ఒక కొలిక్కి రావటం అంత తేలికైన విషయం కాదన్న విషయం తెలియంది కాదు. అలా అని ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పలేరు. అందుకే.. తెలంగాణ మంత్రిహరీశ్ ట్రాక్ మార్చారు.

ఏపీకి కేటాయించిన భవనాల్ని ఖాళీ చేసిన తర్వాత కూడా అట్టిపెట్టుకోవటం కారణంగా ఏపీ అవసరంగా పన్నులు చెల్లించాల్సి వస్తోందని.. నిర్వహణ సరిగా లేక ఆ భవనాల్లో ఎలుకలు తిరుగుతున్నాయని.. భవనాల్ని ఖాళీ చేయకపోవటం కారణంగా ఏపీ ప్రజాధనం వృథా అవుతుందన్న మాటను చెప్పారు. ఏపీకి కేటాయించిన భవనాల్ని తిరిగి తీసుకునే విషయంలో ప్రదర్శిస్తున్న చొరవ.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీల్ని తేల్చేసే విషయంలోనూ ఇదే తొందరను ఎందుకు ప్రదర్శించరన్నది ఒక ప్రశ్నగా మారింది. ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాల్ని ఖాళీ చేయకపోవటం కారణంగా.. వాడుకోకున్నా.. పన్నులు కట్టాల్సి రావటం ఏపీ ప్రజాధనం వృథా అవుతుందని..ఎలుకులు తిరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇన్ని మాటలు చెబుతున్నహరీశ్ ఒక విషయాన్ని మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. వాడని భవనాలకు పన్నులు కడుతున్న ఏపీ సర్కారు.. భవనాల్లో తిరుగుతున్న ఎలుకల్ని చంపేందుకు అవసరమైన మందును కూడా కొనుగోలు చేయగలదన్న విషయాన్ని హరీశ్ మిస్ కావటం ఏమిటి?  ఏపీకి జరుగుతున్న ఆర్థిక నష్టం గురించి హరీశ్ ఆవేదనను చూస్తే.. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన ఆర్థిక నష్టంతో పోలిస్తే.. సచివాలయ భవనాలకు కట్టే పన్నుల మొత్తం ఒక ఖర్చేనా? అయినా.. పక్క రాష్ట్రం ఖర్చు గురించి ఆలోచిస్తున్న హరీశ్.. సొంత రాష్ట్రానికి వచ్చే ఆదాయం గురించి ఎందుకు ఆలోచించట్లేదంటారు?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *