ఉచితంగా వైద్యం ; సీఎం వైఎస్ జగన్
కర్నూలు : పేదలు, మధ్య తరగతి వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించారు. ఇవాళ కర్నూల్లో మూడవ దశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జులై 31వరకు కంటివెలుగు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అవ్వ, తాతలకు గ్రామ సచివాలయాల్లో కంటి పరీక్షలు చేస్తామన్నారు. అంతేకాదు.. అవసరమైన వారికి ఆపరేషన్లు, కళ్లజోడులు ఉచితంగా అందిస్తామన్నారు. గ్రామ వాలంటీర్లు ఇంటికి వెళ్లి కళ్లజోడులు అందిస్తారని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఏరియా ఆస్పత్రులకు రూ.700 కోట్లు కేటాయిస్తున్నాం. కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల రూపురేఖలు మార్చుతాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బోధనా ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. ప్రతి బోధనా ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో ఉంటాడు. 25 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు. పేదవాడు ఆస్పత్రికి పోతే డాక్లర్లు లేరనే పరిస్థితి రాకూడదు. రెండోదశ కంటి వెలుగులో లక్షన్నర మందికి కళ్లజోడులు అందించాం. వేసవి సెలవుల్లో విద్యార్థులకు కంటి చికిత్సలు చేస్తాం. పేదలకు మేలు చేసేందుకే ఈ ప్రభుత్వం ఉంది’ అని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపారు.
,