గ్రూప్-2 నియామక ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
గ్రూప్ -2 నియామక ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే తమకు తెలపాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చేనెల 9 కి హైకోర్టు వాయిదా వేసింది.
గ్రూప్- 2 పోస్టుల భర్తీ కోసం జారీచేసిన 2015 నోటిఫికేషన్, 2016 అనుబంధ నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నలు, కీ లో జవాబులు తప్పుగా ఉన్నాయంటూ 18 మంది పిటిషన్ దాఖలు చేశారు.
నవంబర్ 11, 13 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని డిసెంబర్ 2వ తేదీన టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. ఈ ప్రాథమిక కీపై డిసెంబర్ 5-14 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించింది.
గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రకారం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలువాల్సి ఉంటుంది. అంతకంటే ముందు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాలి. నిబంధనలకు అనుగుణంగా అర్హతలు లేనివారిని తిరస్కరించి, అర్హులైన ఇతర అభ్యర్థులను మళ్లీ ఇంటర్వ్యూలకు పిలువాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఆలస్యాన్ని నిరోధించడానికి సర్టిఫికెట్ల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలువాలని కమిషన్ నిర్ణయించింది.
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని తెలిపింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:3 నిష్పత్తి ప్రకారం మొత్తం 1032 పోస్టులకు గాను 3096 అభ్యర్థులను పిలువాల్సి ఉంటుంది. దివ్యాంగుల జాబితాలో తిరస్కరణలు ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ఆ కోటాలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను పిలువాలని నిర్ణయించారు. దీనిప్రకారం మొత్తం 3147 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తామని కమిషన్ వెల్లడించింది.