భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు

చెన్నై: కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు (శశికళ వర్గం) భారీ భద్రతతో అసెంబ్లీకి బయల్దేరారు. ఈ రోజు (శనివారం) తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కోనుండటంతో.. ఎమ్మెల్యేలను రిసార్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారు.

బలపరీక్షలో పళనిస్వామి నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పళనిస్వామి శిబిరంలో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరిలో 20 మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరగగా, పళనిస్వామి వారిని బుజ్జగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠగా మారింది.

ఇక మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. అమ్మకు ఓటేయండి అంటూ బలపరీక్షలో  పళనిస్వామిని ఓడించాల్సిందిగా ఎమ్మెల్యేలను కోరారు. ఆయన వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (89), కాంగ్రెస్ పార్టీలు (8) బలపరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఏం జరుగుతుందనే దానిపై తమిళనాడు పాటు దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *