హైదరాబాద్ మెట్రో డేట్ ఫిక్స్…
రెండున్నర యేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఓ తీపివార్త. హైదరాబాద్ మెట్రోరైల్ స్టార్టింగ్ డేట్ వచ్చేసింది. ఈ యేడాది చివరిలోగా హైదరాబాద్ మెట్రోరైల్ పరుగులు పెడుతుందని మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ చెప్పేశారు. కేటీఆర్ ఈ వార్త చెప్పిన వెంటనే నగర వాసులు సంబంరాలకు అంతేలేదు.
తాజాగా శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడతగా రద్దీ ఎక్కువగా ఉండే రెండు కారిడార్లలో మొత్తం 56 కిలోమీటర్ల మేర మైట్రో రైల్ను ప్రారంభిస్తామన్నారు. ఇందులో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 29 కిలోమీటర్లు, నాగోల్ నుంచి హైటెక్సిటీ వరకు 27 కిలోమీటర్ల మెట్రో మార్గం డిసెంబర్ నాటికి నగరవాసులకు అందుబాట్లోకి తేనున్నట్టు చెప్పారు.
ఇక ఇక్కడ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ)తోపాటు నాలుగు ప్రాంతాల్లో స్కైవేలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇక తెలంగాణలో పట్టణాల అభివృద్ధికి సైతం తెరాస ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేసినట్టు కేటీఆర్ తెలిపారు.
పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ రూ.5.600 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. మరో రూ.5వేల కోట్లను రుణంగా తీసుకొని మొత్తంగా 10,600 కోట్ల రూపాయలతో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వెచ్చించనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.