లష్కరే తోయిబాకు అతిపెద్ద మద్దతుదారుణ్ని: ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు తాను అతిపెద్ద మద్దతుదారుణ్ని అని ప్రకటించుకున్నారు. అంతే కాదు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ, దాని రాజకీయ విభాగం జమాత్ ఉద్ దవాలకు కూడా తానంటే ఎంతో ఇష్టమని ముషారఫ్ పేర్కొన్నారు. దీనికి తోడు.. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పర్వేజ్ ప్రశంసించారు. 2008 ముంబై దాడుల తర్వాత సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించి.. అమెరికా 10 మిలియన్ డాలర్లను వెల కట్టింది. అయితే సయీద్ 2008 ముంబై దాడుల్లో పాల్గొనలేదని ముషారఫ్ చెప్పారు. ముంబై దాడుల్లో పాల్గొనలేదని హఫీజ్ సయీద్ కూడా తీవ్రంగా ఖండించారని ఆయన తెలిపారు.

2002లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థను ముషారఫ్ ప్రభుత్వం నిషేధించింది. నాడు నిషేధించిన ముషారఫే నేడు.. ఆ ఉగ్రవాద సంస్థకు అతిపెద్ద మద్దతుదారుణ్ని అని ప్రకటించుకోవడం విస్మయానికి గురి చేస్తుంది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. శాంతిని నెలకొల్పే దిశగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థను నిషేధించామని ముషారఫ్ పేర్కొన్నారు. ముజాహిద్దీలను తగ్గించాలనే ఉద్దేశంతో, రాజకీయ చర్చల కోసం ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యంగా కశ్మీర్లో భారత్‌కు వ్యతిరేకంగా పని చేయడంలో లష్కరే హస్తం ఉన్న విషయం తెలిసిందే. కశ్మీర్ లోయలో భారత సైన్యాన్ని దెబ్బతీయడానికి లష్కరేకు సహకరించామని పర్వేజ్ ముషారఫ్ పేర్కొన్నారు. గత వారమే లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌‌కు గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *