కాశ్మీర్ లో చొరబడుతున్న ఇద్దరు పాకిస్థానీయులు అరెస్ట్
పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఆగస్టు 21వ తేదీన అదుపులోకి తీసుకున్నట్టు చినర్ కర్ప్స్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధీల్లాన్ తెలిపారు. శ్రీనగర్ లోని మీడియా కన్ఫెరెన్సులో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ కాశ్మీర్ లో శాంతికి విఘాతం కలిగిస్తుందని, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మరి ఎగదోస్తుందని, ముఖ్యంగా ఆగస్టు 5 తర్వాత ప్రయత్నాలు ఎక్కువ చేస్తోందని అన్నారు. కాశ్మీర్ లోయలోకి వీలైనంత మేర ఉగ్రవాదులను పంపాలన్న పాక్ ప్రయత్నాలు నెరవేరడం లేదని, సరిహద్దుల్లోని శిబిరాలన్నీ ఉగ్రవాదులతో నిండిపోయాయని, వారిని కశ్మీర్లోకి పంపేందుకు రోజూ ప్రయత్నిస్తోందని అన్నారు. ఆగస్టు 21న అలాంటి ప్రయత్నమే చేయగా, ఈ ఇద్దరు ఉగ్రవాదులూ పట్టుబడ్డారని ఆయన తెలిపారు. ఈ ఇద్దరు లష్కరే తోయిబాకీ చెందిన వారీగా గుర్తించారు. పాకిస్థాన్కు చెందిన ఖలీల్ అహ్మద్, మొజమ్ ఖోకర్లను బారాముల్లా జిల్లాలోని బొనియార్ సెక్టార్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉగ్రవాదులకు పాక్ సైన్యానికి చెందిన 50 మంది శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. శిక్షణ తర్వాత ఈ ఉగ్రవాదులు రేషియాన్ గలీ, కండ్లన్ గలీ గుండా జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. వీరితోపాటు 80 నుంచి 90 మంది ఎస్ఎస్జీ కమాండోలు ముజఫరాబాద్లో శిక్షణ పొందుతున్నారు. పాక్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీం (బ్యాట్) వీరి సాయంతో హజీపూర్ నలా వద్ద భారత భద్రతా దళాలపై దాడికి కుట్రపన్నినట్టు సమాచారం. జురా, జబ్బార్ వ్యాలీ వద్ద భారత ఆపరేషన్ల నుంచి సురక్షితంగా బయటపడేందుకు బంకర్లను నియమిస్తున్నట్టు నిఘా వర్గాలు తెలిపారు.