ధోని ధరఖాస్తుకు ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ విండీస్ పర్యటనకు దూరంగా ఉంటానని బీసీసీఐ అధికారులకు తెలిపిన విషయం తెలిసిందే. ఆర్మీ బెటాలియన్లో శిక్షణ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన దరఖాస్తుకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ రెండు నెలల పాటు పారామిలటరీ రెజిమెంట్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.
దీనిలో భాగంగా ఆర్మీలో పని చేయడానికి ఇటీవల భారత ఆర్మీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశాడు. తాజాగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.. ధోని దరఖాస్తుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్యారాచూట్ రెజిమెంట్ బెటాలియన్లో రెండు నెలల పాటు శిక్షణ తీసుకుంటాడు. కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ ఉండే అవకాశం ఉంది. కానీ అతనెలాంటి సైనిక చర్యల్లో భాగం కాలేడని తెలిసింది.