జలయోధుడు విద్యాసాగర్ రావు ఇక లేరు
నీటిపారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, రాష్ట్ర నీటిపారుదల సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు(78) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్రావుకు ఇద్దరు సంతానం(అమ్మాయి, అబ్బాయి) ఢిల్లీలో సెటిలయ్యారు. ఆయన నల్లగొండ జిల్లాలోని జాజిరెడ్డి గూడెంలో 1939 నవంబర్ 14న జన్మించారు. మారుమూల గ్రామంలో జన్మించిన ఈయన ఇంజనీరుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర జలసంఘంలో పనిచేశారు. అంతర్జాతీయస్థాయిలో జలవనరులపై అధ్యయనం చేసిన ఘనత విద్యాసాగర్రావుది.
విద్యాసాగర్రావు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. నీళ్లు నిజాలు ఆయన ఇంటిపేరుగా మారింది. నిర్మొహమాటం ఆయన వ్యక్తిత్వం. చేసింది ఇంజనీరు పనైనా కొలువులో ఉన్నన్నాళ్లూ మంచి రచయితగా, నటుడిగా పాపులరయ్యారు. రిటైర్మెంటు తర్వాతే ఆయన తెలంగాణ నీటివాట నిజాలను నిగ్గుతేల్చిన ఇంజనీరుగా అందరికీ పరిచమయ్యాడు. తెలంగాణ సమజానికి టీఎంసీలు, క్యూసెక్కులు గురించి చెప్పిన మాస్టారు విద్యాసాగర్రావు.