సినిమా కోసం.. పట్టాలకు బాంబులు పెట్టారు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చేరువలో చోటు చేసుకున్న రెండు రైలు ప్రమాదాలు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ పనేనని బీహార్ పోలీసులు పేర్కొన్నారు. 2016 అక్టోబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన ఈ ఘటనల్లో 151 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి గాయాలయ్యాయి. రైలు ప్రమాదాలపై విచారణ చేపట్టిన పోలీసులు ఉమాశంకర్ పటేల్, మోతీలాల్ పాశ్వాన్, ముకేశ్ యాదవ్ లను అరెస్టు చేశారు.

భారత్-నేపాల్ సరిహద్దులో పనిచేస్తున్న ఈ ముగ్గురూ ఘోరసహాన్ జిల్లాలోని రైల్వే ట్రాక్ కు కుక్కర్ బాంబును అమర్చినట్లు పోలీసులు చెప్పారు. విచారణలో దుబాయ్ లో ఉంటున్న ఐఎస్ఐ ఏజెంటు సూచనలతోనే రైల్వే ట్రాక్ కు బాంబు అమర్చినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ముగ్గురిలో ఓ వ్యక్తి ఇండోర్-పాట్నా ఎక్స్ ప్రెస్, అజ్మీర్-సీల్దా ఎక్స్ ప్రెస్ లు పట్టాలు తప్పడంలో తన పాత్ర ఉన్నట్లు చెప్పాడని వివరించారు.

రైలు ప్రమాదాలకు కుట్ర పన్నినందుకు ముగ్గురికీ ఇప్పటివరకూ బ్రిజ్ కిషోర్ గిరి అనే నేపాలీ జాతీయుడి నుంచి రూ.3లక్షలు అందినట్లు చెప్పారు. కాగా, బ్రిజ్ తో పాటు శంభు గిరి, ముజాహిర్ అన్సారీ అనే ఇద్దరిని నేపాల్ కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరికి కూడా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో ఒకడైన మోతీలాల్ పాశ్వాన్ గతంలో ఓ మావోయిస్టు అని తెలిపారు.

ఉమాశంకర్ పై నాలుగు క్రిమినల్ కేసులు, మోతీలాల్, ముకేశ్ లపై 12 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. కాగా, రైలు పట్టాలకు బాంబులను అమర్చింది మోతీలాలేనని తెలిసింది. రైళ్లను పట్టాలు తప్పిస్తే పెద్ద మొత్తంలో నగదు, వాహనాలు ఇస్తానని బ్రిజ్ చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ భోజ్ పూరి సినిమాను తెరకెక్కించేందుకు ఆర్ధికంగా కూడా సాయపడతానని బ్రిజ్ చెప్పినట్లు మోతీలాల్ విచారణలో చెప్పాడని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *