పంజా విసిరిన జైపూర్ పింక్ పాంథర్స్
సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–23 తేడాతో యు ముంబాను ఓడించింది. జైపూర్ జట్టు 25 రైడ్ పాయింట్లు, 11 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా… యు ముంబా 18 రైడ్ పాయింట్లు, 5 టాకిల్ పాయింట్లతో పాంథర్స్ను అందుకోలేకపోయింది. పాంథర్స్ తరపున దీపక్ హుడా 11 పాయింట్లతో మెరిశాడు. అతనికి నితిన్ (7), దీపక్ (6), అమిత్ హుడా (5) పాయింట్లతో చక్కని సహకారం అందించారు. యు ముంబా తరపున అభిషేక్ (7), డాంగ్ జీన్ లీ (6) పాయింట్లతో పర్వాలేదనిపించారు.
ప్రొ కబడ్డీ లీగ్ మాజీ చాంపియన్స్ జైపూర్ పింక్ పాంథర్స్ ఏడో సీజన్ను ఘనవిజయంతో ప్రారంభించింది. ఆరంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ను ఓడించి దూకుడు మీదున్న యు ముంబాను జైపూర్ పింక్ పాంథర్స్ అడ్డుకుంది. మొదట నుంచి దూకుడును ప్రదర్శించిన పాంథర్స్ ఏ దశలోనూ యు ముంబాకు కోలుకునే అవకాశాన్నివ్వలేదు. ముఖ్యంగా దీపక్ హుడా తన రైడ్లతో ప్రత్యర్థిని దడదడలాడించాడు. మొదటి అర్ధ భాగం ముగిసే సరికి జైపూర్ 22–9 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. రెండో భాగంలోనూ పింక్ పాంథర్స్ ఇదే దూకుడును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసిన పాంథర్స్ ఒక్క సారి కూడా ఆలౌట్ కాలేదు.